ఒక గ్రామంలో శ్రావ్య అనే అమ్మాయి ఉండేది. ఆమె తల్లిదండ్రులు దినసరి కూలీలు.
వారి ఆర్థిక స్థితి దయనీయంగా ఉండేది. పూట గడవటానికి కూడా కష్టపడాల్సిన పరిస్థితి.
శ్రావ్యకు చదవడం అంటే చాలా ఇష్టం. కష్టపడి చదివే కూతురును అపురూపంగా చూసేవారు తల్లిదండ్రులు.
ఏదో ఒకరోజు అమ్మాయి చదువు తమ కుటుంబానికి వెలుగుని తీసుకొస్తుంది అని ఆమె తల్లిదండ్రుల గాఢమైన నమ్మకం.
శ్రావ్య తన స్కూల్లో ఎంతో పట్టుదలతో పాఠాలు నేర్చుకునేది.
తన స్నేహితులు పాఠాలను అర్థం చేసుకోలేక ఇబ్బంది పడితే,
శ్రావ్య వారికి సహాయం చేస్తూ పాఠాలు అర్థమయ్యేలా వివరించేది.
ఒకసారి తన క్లాస్లో ఉన్న రాము అనే విద్యార్థి పాఠాలు చదవలేకపోయి
క్రమంగా స్కూల్కు రావడం మానేశాడు. అతడిని చూసి బాధపడిన శ్రావ్య,
రాత్రిళ్లు తన పాఠాలు ముగించిన తర్వాత రాము ఇంటికి వెళ్లి అతనికి చదువు
నేర్పడం మొదలు పెట్టింది. కొన్ని రోజుల్లోనే రాము స్కూల్కు తిరిగి వచ్చి,
పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఉపాధ్యాయులు పాఠాలు
చెప్పిన తర్వాత అర్థం చేసుకోలేని విద్యార్థులకు ఉపాధ్యాయుల మార్గ దర్శకత్వంలో క్లిష్టమైన అంశాలు వారికి అర్థమయ్యేలా చేస్తూ
అందరికీ ఆదర్శంగా నిలిఛేది. అంతేకాక, తరువాత ఆ పాఠ్యాంశాల్లోని
ప్రశ్నలు క్లాస్మేట్స్కు అర్థమయ్యేలా వివరించి, వారిలో ఆత్మవిశ్వాసం
పెంపొందించుకోవడానికి సహాయపడింది. "మనకు తెలియని విషయాలు ఎల్లప్పుడూ
తెలుసుకుంటూ ముందుకు వెళుతుండాలి" అంటూ వారిని ప్రోత్సహించేది.
కొంతకాలానికి శ్రావ్య తో పోటీపడుతూ ఎక్కువ మంది విద్యార్థులు కష్టపడి
చదవడం ప్రారంభించారు. తన చుట్టూ ఉన్న వారికి ఎప్పుడు అవసరం
వచ్చినా శ్రావ్య ముందుండేది. ఒకసారి స్కూల్లో యూనిఫామ్ చినిగిపోయిన
స్థితిలో ఉన్న తన స్నేహితురాలికి తను దాచుకున్న డబ్బు ఉపయోగించి
యూనిఫామ్ కొనివ్వడం, ఆమె మంచి మనసును ప్రతిబింబించింది.
ఆ స్నేహితురాలు కూడా ఆత్మవిశ్వాసంతో స్కూల్కు రావడం ప్రారంభించింది.
శ్రావ్య పరోపకార గుణాన్ని తన స్నేహితులే
కాకుండా ఉపాధ్యాయులు కూడా చాలా ప్రశంసించేవారు. ఒక సందర్భములో
కొంతమంది
గణితాన్ని చాలా కష్టమైన విషయంగా భావించి పరీక్షలకు భయపడుతున్న విద్యార్థులకు
శ్రావ్య గణితం ఆటలాగా అర్థమయ్యేలా బోధించింది. రోజూ స్కూల్
తర్వాత కొన్ని గంటలు వారితో గడిపి, గణిత ఉపాధ్యాయుని వద్ద తాను నేర్చుకున్న చిన్నచిన్న ఉదాహరణలు
అర్థం చేయిస్తూ వారికి గణితంపై ఆసక్తి పెంచింది. పరీక్షలు వచ్చేసరికి,
ఆ విద్యార్థులు కూడా శ్రద్ధగా చదివి మంచి మార్కులు సాధించారు.
గ్రామంలో ఒక పేద విద్యార్థిని స్కూల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు
నిరాకరించినప్పుడు, శ్రావ్య ఆ పిల్లాడి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి
చదువు వల్ల వారి జీవితంలో కలిగే మార్పులను వివరించింది.
వారు అంగీకరించి ఆ పిల్లాడిని స్కూల్కు పంపారు. ఆ విద్యార్థి
తరువాత బాగా చదువుకుని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి
తన కుటుంబాన్ని గర్వపడేలా చేశాడు.శ్రావ్య ఈ పనులన్నీ చేస్తూనే తన లక్ష్యం పై దృష్టి పెట్టి,
పట్టుదలతో చదువుకుని ఆమె స్కాలర్షిప్ ద్వారా పెద్ద యూనివర్సిటీలో
చేరింది. చివరకు, కొన్ని సంవత్సరాల కఠినమైన శ్రమ తర్వాత శ్రావ్య
సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణురాలై ఒక జిల్లా పాలనాధికారిగా ఎంపికైంది.
గ్రామానికి తిరిగి వచ్చినపుడు, ఆమెను చూసి ప్రతి ఒక్కరు గర్వించారు. శ్రావ్య పేదరికం కడలిని దాటి తను కన్న కలలు నిజం చేసుకుని జిల్లా కలెక్టర్గా ఎంపికైన సందర్భం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. తను మొదటి పాఠశాల సందర్శన లో భాగంగా తాను చదివిన పాఠశాలకు వెళ్ళింది. శ్రావ్య అక్కడ తనకు పాఠాలు బోధించిన గురువులను చూసి భావోద్వేగానికి లోనైంది. అందరి ముందు నిల్చొని అందర్నీ కలయ చూసింది. ఆమె గొంతు లోంచి మాట రాలేదు. కొన్ని క్షణాల తరువాత తేరుకుని, ఆమె అందరు విద్యార్థుల మనసులను హత్తుకునేలా ఇలా చెప్పింది:
"నన్ను నేడు మీ ముందు కలెక్టర్గా నిలబెట్టింది మా గురువులే. నేను ఒక చిన్న పేద పిల్లగా పాఠశాలకు వచ్చాను. అప్పట్లో నాకు కలలు కనడం కూడా భయంగా అనిపించేది. కానీ మా గురువులు నాలో ఆత్మవిశ్వాసం నింపారు. నాకు చదువు ఒక్కటే కాకుండా, జీవితం అంటే ఏమిటో నేర్పించారు. ఈ స్థాయికి రావడానికి నేను పడ్డ కష్టానికి పునాదిగా వారి సహకారం ఎంతో ఉంది.
విద్యార్థులారా, మీ ఉపాధ్యాయులు మీకు తల్లిదండ్రుల తర్వాత అంతటి వారు. వాళ్ళు చెప్పే ప్రతి మాట మీ జీవితాన్ని మలచే బాటగా మారుతుంది. వారిని గౌరవించండి, వారి మాటలను ఆచరించండి. ఉపాధ్యాయుడి జీవితం విద్యార్థుల విజయంతో గౌరవాన్ని పొందుతుంది. . మీరు ఎదిగితే , మీ ఉపాధ్యాయులు గర్వపడతారు.
ఇవాళ నేను కలెక్టర్గా ఉన్నా, మా గురువులు నాకు మొదటిసారిగా అక్షరాలు నేర్పినప్పటి ఆ రోజు నా హృదయం లో పదిలంగా ఉంది. కష్టపడి చదివే విద్యార్థుల భవిష్యత్తు తీర్చి దిద్దడం కోసం ఉపాధ్యాయులు ఎప్పుడూ తపన పడుతూనే అంటారు. విద్యకు మరియు గురువులకు గౌరవం ఇవ్వడం మీ బలమైన భవిష్యత్తుకి పునాది."
శ్రావ్య మాటలతో విద్యార్థులు ఎంతో స్ఫూర్తిని పొందారు. ఆ సమయానికి ఉపాధ్యాయుల కళ్లల్లో ఆనందభాష్పాలు వెలుగులీనాయి. ఆ పాఠశాల ఆ రోజు గురువుల గొప్పతనంతో ప్రతిధ్వనించింది.
ఈ మొత్తం ప్రయాణంలో శ్రావ్య ఎదుర్కొన్న సవాళ్లు ఆమెను మరింత
బలంగా తీర్చిదిద్దాయి. తల్లిదండ్రుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శనం,
తన కఠోర శ్రమతో గొప్ప విజయాలు సాధించింది. ఆ విధంగా శ్రావ్య కథ ప్రతి
విద్యార్థికీ స్పూర్తిగా నిలుస్తుంది. తాను సాధించిన విజయం ఎందరో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి దిశా నిర్దేశాన్ని
అందించింది. ఇలాంటి వ్యక్తులు మాత్రమే జీవితాన్ని
నిజంగా అర్థవంతంగా తీర్చిదిద్దుకోగల్గుతారు.పదిమందికి ఆదర్శంగా నిలుస్తారు.
Comments